calender_icon.png 20 October, 2024 | 5:16 AM

‘మహా’యుద్ధంలో చెరుకే కీలకం

20-10-2024 02:58:29 AM

ముంబై, అక్టోబర్ 19: మహారాష్ట్ర ఎన్నికల్లో పశ్చిమ ప్రాంతాన్ని యుద్ధభూమిగా బీజేపీ, కాంగ్రెస్ భావిస్తాయి. ఇక్కడ చెరుకు, ఉల్లి రైతులే ఎక్కువ ప్రభావం చూపిస్తారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో చెరుకు, ఉల్లి అంశ ంపైనే అధికార బీజేపీని దెబ్బ కొట్టి మహావికాస్ అఘాఢీ కూటమి ఆధిపత్యం సాధిం చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తోంది.

పశ్చిమ మహారాష్ట్రలోని ప్రాంతీయంగా గ్రామాల్లో నెలకొ న్న వ్యవసాయ సంక్షోభం, పట్టణాల్లో సమస్యలనే ప్రధాన వ్యూహంగా ప్రతిపక్ష కూటమి కార్యాచరణ రూపొందిస్తోంది. అంతేకాకుం డా పశ్చిమ మహారాష్ట్ర అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. రాజకీయంగానూ ఎంతో చరిత్ర ఉంది. పశ్చిమ ప్రాంతంలో పుణె జిల్లా మినహా మిగితా గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ చెరుకు, డెయిరీ, ఉద్యాన, ఉల్లి పంటల ఆధారపడుతుంది. ఈ అంశాలపై ప్రతిపక్ష కూటమితో పాటు అధికార మహాయుతి కూటమి కూడా దృష్టి సారించాయి. 

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

పశ్చిమ మహారాష్ట్రలోని మొత్తం 58 అసెంబ్లీ సీట్లలో ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది. 2014లో మోదీ వేవ్‌కు ముందు ఈ ప్రాంతం కాంగ్రెస్‌తో పాటు ఎన్సీపీకి కంచుకోటగా ఉండేది. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌తో పాటు శరద్‌పవార్ ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయారు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు తిరిగి పుంజుకున్నాయి. బీజేపీ, శివసేన నిలిచినా ఐదు జిల్లాల్లో పూర్వవైభవాన్ని సాధించాయి. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) చెరో 3 సీట్లు సాధించగా అధికార మహాయుతి కేవలం 4 సీట్లకే పరిమితమైంది.

మద్దతు ధరపై రైతుల నిరసనలు, ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై ఆగ్రహం పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి కూటమి పేలవ ప్రదర్శనకు కారణమని చెప్పవచ్చు. ఈ ఎన్నికలకు ముందు శరద్‌పవార్ తన అనుభవాన్ని రంగరించి కూటమిని ముందుంచి నడిపించారు. కీలకమైన నేతలను బరిలోకి దింపారు. తన మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు చేసినా లెక్కచేయకుండా పుణె, సతారా, సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్ జిల్లాల్లో విజయం సాధించారు. 

జోరుగా కూటమి చర్చలు

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఓటర్ల మూడ్ మారడం, అధికార మహాయుతిపై అసంతృప్తి పెరిగింది. ఇది మహావికాస్ అఘాడీ నేతల్లో ఉత్సాహం పెంచింది. అందుకే సీట్ షేరింగ్‌పై కూటమిలో భాగస్వామ్య పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని 288 సీట్లకు గాను 260 సీట్లపై స్పష్టత వచ్చింది. మిగితా 28 స్థానాలపై త్వరలో జరిగే చర్చల్లో ఏకాభిప్రాయం వచ్చే అవకాశముంది. కాంగ్రెస్ సైతం ఈ సారి తన ఎమ్మెల్యేలను పెంచుకునేందుకు నమ్మకమైన నాయకులపై దృష్టి సారించింది.

అంతేకాకుండా ఉద్ధవ్ శివసేన, శరద్‌పవార్ ఎన్సీపీతో సమన్వయంతో ముందుకుపోతోంది. పార్టీల మధ్య సమస్యలు ఉంటే ఓట్లు చీలే అవకాశముందని కూటమి జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కాగా, పుణె, కొల్హాపూర్ నగరాల్లో సమస్యలు, సతారా, సాంగ్లీ, కొల్హాపూర్‌లో వరదలు, వ్యవసాయ సమస్యలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంగ్లీ, సతారా జిల్లాల్లో బీజేపీ, ఎన్సీపీ (ఎస్పీ) మధ్య గట్టి పోటీ ఉండనుంది.