లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో దర్శకుడు గురుప్రసాద్ తెరకెక్కిన చిత్రం ‘ఝాన్నీ ఐపీఎస్’. తమిళ, కన్నడ భాషల్లో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు హక్కులను ఆర్కే ఫిలిమ్స్ అధినేత డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు.
ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్లో నిర్వహించింది. సీనియర్ నటుడు సుమన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ‘లక్మీరాయ్ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఫైట్స్ ఆదరగొట్టారు. తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
తెలుగులోనూ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. చిత్ర నిర్మాత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “ఝాన్నీ ఐపీఎస్’లో థ్రిల్లర్ మంజు రూపొందించిన 8 ఫైట్స్ లక్మీరాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచి పోతాయి. డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపీఎస్ ఆఫీసర్గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్ష్మీరాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది.
సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు. తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్, డాన్సర్, నటి ఆక్సఖాన్, నటుడు జేవీఆర్, సదాశివరెడ్డి, భాస్కర్రావు, హీరో కిరణ్, అగర్వాల్, జీఎస్రెడ్డి, లక్ష్మి, దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.