calender_icon.png 28 September, 2024 | 2:53 AM

జశ్‌రాజ్ భార్య మధుర కన్నుమూత

26-09-2024 02:35:47 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దివంగత పండిత్ జశ్‌రాజ్ భార్య మధుర పండిత్ బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని మధుర కుమార్తె దుర్గ ధ్రువీకరించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న మధుర చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. తన తండ్రి డాక్యుమెంటరీ చిత్రీకరించడంతో పాటు కళల పట్ల ఆమె అంకితభావం గొప్పదని దుర్గ పేర్కొన్నారు.

ఈ డాక్యుమెంటరీతో మధుర అనేక ప్రశంసలు పొందారని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాత డాక్టర్ వీ శాంతారామ్ కుమార్తె అయిన మధుర 1962లో పండిట్ జశ్‌రాజ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె నాటకాలకు దర్శకత్వం వహించడంతో పాటు ప్రముఖుల జీవిత చరిత్రలు రచించారు.

సంగీత మార్తాండ్ పండిట్ జశ్‌రాజ్ (2009), ఆయ్ తుజా ఆశీర్వాద్ (2010) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. లతా మంగేష్కర్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేశారు. భారత శాస్త్రీయ సంగీతాన్ని సంరక్షించడంతో పాటు ప్రోత్సహించేందుకు మధుర కృషి చేశారు. ఇందులో భాగంగా ఆమె భర్త జశ్‌రాజ్ జీవిత చరిత్రను చిత్రీకరించారని ఆమె కూతురు దుర్గ వెల్లడించారు.