21-02-2025 10:28:02 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలోని కోర్టు హాలులోకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడిన మహిళకు, జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ.సుచరిత శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా.... 2017 ఫిబ్రవరి 28 న కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసుల కాల్ వర్క్ నిర్వహించిచుండగా, అట్టి సమయంలో పాల్వంచ వెంకటేశ్వర కాలనీ చెందిన కొడాలి నర్మదా కోర్టు హాలులోకి ఒకేసారి దూసుకు వచ్చింది. ఆ సమయంలో వాయిదాకు హాజరైన పాల్వంచ మండలం ఇల్లందుల పాడుకు చెందిన గుగులోత్ మాన్సింగ్ ను, కోర్టులో జడ్జి ముందే మాన్సింగ్ పైకి వెళ్లి దాడి చేసి అతని గల్లా పట్టుకొని బూతులు తిడితూ చేతులతో కొట్టుచుండగా కోర్టులో ఉన్న పలువురు న్యాయవాదులు, నర్మద నుండి మాన్సింగును విడిపించారు.
ఈ విషయమై అప్పటి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జమలేశ్వరరావు కోర్ట్ సూపరింటెండెంట్ రషీద్ అలీ ఖాన్ ను ఆదేశించగా 2017 మార్చి ఒకటో తేదీన, రషీద్ అలీ ఖాన్ కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లొ ఫిర్యాదు చేశారు. అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ జి. తిరుపతి కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో ఏడుగురు సాక్షులను విచారించారు. నిందితురాలైన కొడాలి నార్మదపై నేరము రుజువు కావడంతో ఐపిసిలోని వివిధ సెక్షన్ల క్రింద (ఏడాదిన్నర) జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ ను ఏపిపి గాదె నాగలక్ష్మి నిర్వహించగా కోర్టు నోడల్ ఆఫీసర్, జి ప్రవీణ్ కుమార్, లైజాన్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఘని, కోర్టు పిసి (కోర్టు డ్యూటీ ఆఫీసర్ )దొంతోజు కామేష్ లు సహకరించారు.