06-04-2025 11:38:05 PM
చండీగఢ్: రైతు సమస్యల పరిష్కారం కోసం పంజాబ్లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా సిర్హింద్లో గతేడాది నవంబర్ 26 నుంచి నిరవధిక దీక్ష చేస్తున్న రైతు సంఘం నేత జగ్జీత్సింగ్ దల్లేవాల్ ఆదివారం తన దీక్షను విరమించారు. నిరవధిక దీక్ష కారణంగా జగ్జీత్ సింగ్ ఆరోగ్యం క్షీణిస్తున్నందున దేశవ్యాప్తంగా రైతాంగం నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. కొద్దిరోజులుగా ఆయన దీక్ష విరమించాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రణ్వీత్ సింగ్ సైతం దీక్ష విరమించాలని పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం జగ్జీత్సింగ్ తన దీక్షను విరమించారు. ‘మీ విజ్ఞప్తులను గౌరవిస్తూ దీక్షను విరమిస్తున్నా’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.