calender_icon.png 29 September, 2024 | 1:01 PM

పాలకుల గుండెల్లో గుబులు రేపిన విప్లవోద్యమ ప్రజా ప్రస్థానం

09-09-2024 04:19:23 PM

జగిత్యాల జైత్రయాత్రకు 46 ఏళ్లు

జగిత్యాల,(విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్ర పాలకుల గుండెల్లో గుబులు పుట్టించి విప్లవ ఉద్యమ ప్రస్థానానికి నాంది పలికిన ‘జగిత్యాల జైత్రయాత్ర’కు నేటికీ 46ఏళ్లు. విప్లవోద్యమాలకు జగిత్యాల జైత్రయాత్రే నాంది కాగా సమాచార వ్యవస్థ అందుబాటులో లేని కాలంలో మాటల ద్వారా  లక్షలాది మందిలో కదలిక తెచ్చి జన ప్రభంజనాన్ని ఒకే చోటకు చేర్చిన రోజు 1978 సెప్టెంబర్ 9వ తేదీ. జగిత్యాల జైత్రయాత్ర రైతు కూలీ సంఘం భారీ బహిరంగ సభ చరిత్ర పుటల్లో నిలిచిపోయిన రోజు ఇదే.1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీలో మొదటి రైతాంగ పోరాట స్పూర్తితో శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతం సీతంపేట, పార్వతీపురం ప్రాంతంలో 1969లో గిరిజన రైతాంగ పోరాటం ఆరంభమైంది. ఆనాడు గిరిజన రైతాంగ పోరాటం వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు ప్రాణిగ్రాహి వంటి నాయకులు రెండేళ్ళు సాగింది.

ఆ ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడిం చింది. ఆనాటి హోంమంత్రి జలగం వెంగళరావు సాయుధ బలగాలతో వెళ్లి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఉద్యమం ఆగినా ఉద్యమ స్పూర్తిని ప్రభుత్వం ఆపలేక పోయింది. శ్రీకాకుళం రైతాంగ పోరాట స్పూర్తిగా  కొండపల్లి సీతారామయ్య ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అప్పట్లో యాక్టీవ్‌ సీపీఐఎంఎల్  సీవోసీ సంఘాల కార్యకర్తల ద్వారా ఉద్యమ ఆవశ్యకతను అందరికీ ప్రచారం చేశారు. ఆ సమయం తెలంగాణలో భూస్వాములు, గడిలలో జరిగే అరాచకాలు, దోపిడి, వెట్టి చాకిరీ ఎదుర్కునేందుకు రైతు కూలీ సంఘం ఆవిర్భవించింది. 1977 ఆగస్టులో విప్లవ నేతలు గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ కొండపల్లి సీతారామయ్య పిలుపు మేరకు అనేక మంది రంగంలోకెళ్ళి కార్యాచరణను ప్రారంభించారు.

అనేక మంది యువకులు గ్రామాల్లో తిరిగి అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజల చైతన్య పరిచారు.  ప్రతీ ఊరిలో రైతు కూలీ సంఘాలు ఏర్పాటు చేసి పాలేర్లకు జీతాలు పెంచాలని, పశువుల కాపరులకు కూడా వేతనాలు,దున్నేవాడిదే భూమి అనే నినాదాలతో అందరిని చైతన్యం రగిలించారు. గ్రామ పెద్దల ఇళ్లలో ఉచితంగా పని చేయడాన్ని మాన్పించి శ్రమ విలువను తెలియ జెప్పారు. ఈ క్రమంలో 1978 ఏప్రిల్ -మే నెలల్లో 30 రోజులు మంథని సమీపంలోని శాస్త్రులపల్లెలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. విప్లవనేతలు కేజీ సత్యమూర్తి, ఎక్కలదేవి సాంబశివరావు పాఠాలు బోధించారు. విప్లవ ఉద్యమ ఆవశ్యకత, రైతాంగ సమస్య, భూస్వాముల దోపిడి వివరించి శిక్షణ పొందిన  యువకులు ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని పల్లెలకు వెళ్లి రైతు, కూలీలకు వివరించారు. అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో 1978 సెప్టెంబర్ 9న రైతుకూలీ సభ ఏర్పాటు చేసి మాటలతో  పల్లెల ప్రజలు జగిత్యాలకు పోటెత్తారు.

ఎటు చూసినా జగిత్యాల జనమే కనపడ్డారు. ఊరు ఊరంతా ఎర్రని జెండాల తో రెపరెపలాడింది. జననాట్య మండలి కళాకారుల విప్లవ గీతాలు, నినాదాలతో నలు దిక్కులు మార్మోగిపోయాయి. ఆ రోజు రైతు కూలీలతో నిర్వహించిన లాంగ్ మార్చ్‌తో జగిత్యాల దద్దరిల్లింది. ఆనాటి సభలో ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లోజుల కోటేశ్వరరావు,నల్లా ఆదిరెడ్డి, వరవరరావు, పోరెడ్డి వెంకటరెడ్డి తదితరులు తమ ప్రసంగాలతో విప్లవ స్పూర్తిని రగిలించారు. ఆనాటి రైతు కూలీ శక్తి ప్రదర్శన సభను అన్ని పత్రికలు విస్తృతంగా కవర్ చేశాయి. పత్రికలే ‘జగిత్యాల జైత్రయాత్ర’గా పతాక శీర్షికలకు ఎక్కించ డంతో అదే పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఇదే ఉద్యమం స్పూర్తితో 1980 లో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్‌ను ప్రారంభించి రెండు దశాబ్దాలు పీపుల్స్ వార్ తెలంగాణ ప్రాంతంలో విప్లవ ఉద్యమం చేసింది. చివరకు 2004లో దేశంలోని మిగిలిన విప్లవ పార్టీలతో మమేకమై మావోయిస్టు పార్టీగా అవతరించింది.