31-03-2025 02:45:53 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హుజుర్ నగర్ లో నిర్వహించిన సన్నబియ్యం పంపిణీ పథకం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని, అదే భాష అవే పదాలు.. ముఖ్యమంత్రి స్థాయి వచ్చినా, మూర్ఖత్వం మారడం లేదని విరుచుకుపడ్డారు. సీఎం అనే సోయిలేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన భాష తీరే ఆయనను బొందపెడుతుందన్నారు. నిన్న హుజూర్ నగర్ సభలో ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై అవే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 15 నెలలు గడిచినా కేసీఆర్ అనే మాట లేకుండా సభ సాగట్లేదని చెప్పారు. సోనియా గాంధి ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారే తప్ప రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదని వెల్లడించారు.
కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ఎలాంటి స్పందన లేదని, మళ్లీ రైతులకు మొదలైన కష్టాలను తల్చుకుంటు పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్ కు శాపనార్ధాలు పెడుతుండ్రని, ప్రభుత్వం ఇస్తామన్న రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. ప్రతిదీ మభ్యపెట్టి మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలోని రైతులు పండించిన సన్నబియ్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ధాన్యమే కొనడం లేదన్నారు. ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడా అని ప్రతిపక్ష నాయకులు అధికారులకు ఫోన్లు చేస్తే ఎత్తడమే లేదని మండిపడ్డారు. వానా కాలంలో ఏ పంట ఎంత కొన్నారు.. దొడ్డు రకానికి బోనస్ ఇస్తామని మాటమార్చి సన్నధాన్యానికి బోనస్ ఇస్తామని, ఎంత ధాన్యం కొన్నారు..? ఎంత బోనస్ ఇచ్చారు..? అంటే సమాధానం లేదన్నారు.
నిన్న హుజూర్ నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ మళ్ళీ కేసీఆర్ ను తిట్టడం తప్ప వేరే పని లేనట్లు తమ నాయకుడిపై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం సాధ్యం కాదన్నారు. ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటారని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు భయపడకుండా ఎండగడుతున్నారని, రేవంత్ రెడ్డి ఉరివేస్తా అంటే.. ప్రజలే నీకు ఉరివేసే రోజులు దగ్గరపడ్డాయని జగదీశ్ రెడ్డి విమర్శించారు. సీఎం గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు.. కానీ కేసీఆర్ గురించి మాట్లాడనిదే ఆయనకు పూట గడవదన్నారు. పక్క దేశాలు చూడు.. ప్రజలు తిరుగబడితే ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో తెలుస్తుందని చురకలంటించారు. పద్ధతి భాష మార్చుకొని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గత ఏడాది కొన్న సన్న వడ్లుకు ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలని జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదని, అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియదన్నారు. నీళ్లు ఇవ్వమంటే రైతుల పొలాలు వేసుకోరు.. నేడు నీళ్ళు ఇస్తామని ఇవ్వకపోవడంతో వేలాది ఎకరాలు నష్టపోయారు. ఒక తడికి ఇస్తే వేలాది ఎకరాలు పెట్టుబడి అయినా వస్తుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి 9000 క్యూసెక్కుల నీరును గతంలో బీఆర్ఎస్ పారించిందని, కన్నెపల్లి పంప్ హౌస్ బాగానే ఉందని అధికారులు చెబుతున్నప్పటికి నడిపించే సోయి ప్రభుత్వానికి లేదని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఎస్పీ(NDSP) ఒక సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని, చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వానికి సోయిలేదన్నారు. రైతన్నలు మేలుకోవాలని కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం చేయాలని ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.