23-04-2025 01:50:18 AM
సూర్యాపేట ఏప్రిల్ 22: వరంగల్ చేపట్టే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు రాష్ర్ట నలుమూలల నుంచి ప్రజలు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజ వ్యతిరేక విధానాలకు ఏర్పాటు చేసిన సభ అనేలా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలోని దండు మైసమ్మ దేవాలయం నుంచి రజతోత్సవ సభకు ఎండ్ల బండ్ల పై వెళుతున్న రైతుల యాత్రను స్వయంగా ఆయన ఎడ్లబండిని నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... గత పదిరోజులుగా సభకు తాము సైతం అన్నట్లుగా రైతులు తమ గోడును బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ కు విన్నవించుకోవాలనే విషయాన్ని తెలుసుకుని ఇక్కడి నుంచి సభకు ఇంత ఎండలో ఎలా వెళ్తారని తాను రైతులను అడుగగా తాము ఈ ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల కంటే అదేం పెద్ద ఇబ్బంది కాదని చెప్పారని, తానే ఐదు రోజులకు కుదించానని తెలిపారు.
ఈ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులకు వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని పేర్కొన్నారు. ఈ యాత్ర బండెనక బండి కట్టి... 16 బండ్లు కట్టి అన్న పాటను మరొక సారి రైతులు గుర్తు చేస్తున్నారన్నారు. ఎల్కతుర్తి మట్టిని తాకి, రజతోత్సవ సభను తిలకించి, కేసీఆర్ మాటలు వినాలన్న రైతుల తపన ఎంతో తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. అనంతరం చివ్వేంల బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు ఆర్థిక చేయూతను ఆయన చేతుల మీదుగా ఎద్దుల గ్రాసం కోసం రూ. 5000 లను రైతులకు అందజేశారు.