20-03-2025 06:03:23 PM
భద్రాచలం (విజయక్రాంతి): రేపటి నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలంటే భయపడకుండా ధైర్యంగా, ఏకాగ్రతతో రాస్తే ఉజ్వల భవిష్యత్తు ఎదురుచూస్తుందని అన్నారు. విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, హెచ్ఎం, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 79 విద్యాసంస్థల్లో 2,665 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తగిన వసతులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో గిరిజన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి నూరుశాతం ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు.