ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): దక్షిణ, మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.