calender_icon.png 1 October, 2024 | 6:04 AM

గళ్లపెట్టె దొంగిలించారని వాతలు

01-10-2024 12:00:00 AM

కన్నతల్లి కర్కశత్వం

కామారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): గళ్లపెట్టెను దొంగలించారని తన పిల్లలకే ఓ తల్లి వాతలు పెట్టి గాయపరిచింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చిన్న కసాబ్‌గల్లిలో రేణుక, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు అంజలి, విష్ణుతో కలిసి జీవనం సాగిస్తున్నది.

స్థానికంగా ఉన్న ముదాం గల్లీలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో అంజలి మూడో తరగతి చదువుతోంది. విష్ణు అదే పాఠశాలలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. సోమవారం ఉదయం ఇద్దరు పాఠశాలకు వెళ్లిన పిల్లలపై ఉన్న వాతలను ఉపాధ్యాయులు గమనించి, ప్రశ్నించారు. తమ తల్లి కాల్చిందని వారు చెప్పడంతో ఉపాధ్యాయులు రేణుకను ప్రశ్నించారు.

ఆదివారం రాత్రి తన భర్త లేని సమయంలో పిల్లలు ఇంట్లో గళ్లపెట్టెను దొంగిలించారని, అందుకే వాతలు పెట్టినట్లు తెలిపింది. దీంతో ఉపాధ్యాయులు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ పోలీస్ సిబ్బందిని పాఠశాలకు పంపించారు. చిన్నారులకు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయంపై పోలీసులు చిన్నారులను ప్రశ్నించగా తాము గళ్లపెట్టను చోరీ చేయలేదని, వేరే కారణాల వల్ల తమను కాల్చి వాతలు పెట్టినట్లు రోధిస్తూ తెలిపారు. తెలియకుండా పిల్లలు చేసిన పొరపాటుకు తల్లి కఠినంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.