ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రధాని మోదీ అగౌరవపరచడం సరికాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే రాసిన లేఖకు బదులు ఇవ్వకుండా ప్రధాని ఆయన్ను అవమానించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నేతలు పాటించకపోవడం విచారకరమని అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ విషయమై స్పందిస్తూ ‘బీజేపీ నాయకులు రాహుల్పై చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్య ల నేపథ్యంలో ఆయన భద్రత గురించి ఆందోళన చెందిన ఖర్గే ప్రధానికి లేఖ రాశారు. మోదీకి పెద్దలపై గౌరవం, ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉంటే ఆయనే స్వయంగా లెటర్ రాసేవారు. కానీ నడ్డా ద్వారా తిరిగి లేఖ రాయించారు. అందులోనూ నాయకుడిని అవమానించారు. ప్రధాని తన హోదాను గుర్తించుకొని సమాధానం ఇచ్చి ఉంటే బాగుండేది” అని ప్రియాంక మండిపడ్డారు.