calender_icon.png 20 October, 2024 | 2:58 AM

అది చిరుత కాదు.. అడవి పిల్లి

20-10-2024 01:00:24 AM

మియాపూర్‌లో చిరుత సంచారం అంటూ జరిగిన ప్రచారంపై అధికారుల స్పష్టత

 శేరిలింగంపల్లి, అక్టోబర్ 19: మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచారం అంటూ జరిగిన ప్రచారంపై అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిరుత సంచరించడం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు చిరుత కోసం తీవ్రంగా గాలించారు. చిరుత పాదముద్రలను గుర్తించేందుకు అటవీ అధికారులు శ్రమించారు. కానీ, ఎక్కడా చిరుత పాదముద్రల ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో శనివారం ఉదయం అపార్ట్‌మెంట్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులోని దృశ్యాల ఆధారంగా, ఆ జంతువు కదలికలను బట్టి అది చిరుత కాదని నిర్ధారణకు వచ్చారు. అడవి పిల్లి అని అటవీ అధికారులు తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.