మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, పడకేసిన పాలన కొనసాగుతోందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రూ.2 లక్షల రుణమాఫీ అయిన ఒక్క రైతును చూపించాలన్నారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో అధోగతి పాలైన తెలంగాణను పదేండ్లలో కేసీఆర్ గాడిలో పెట్టారని, అన్నీ రంగాల్లో అగ్రగామిగా నిలిపారన్నారు.
నేడు దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో రూ.80 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. వరంగల్ డిక్లరేషన్లో రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పంటల బీమా, పసుపు బోర్డు, చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామని గొప్పలు చెప్పారని, కానీ ఎందులోనూ ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజన మూలంగా బీమా కంపెనీలకు లాభం తప్పా రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు.