calender_icon.png 24 September, 2024 | 6:51 PM

వారి వల్లే మేడిగడ్డ మేడిపండయింది

24-09-2024 02:15:04 AM

  1. రాజకీయ నాయకుల జోక్యమే కొంపముంచింది
  2. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఉంటే మంచిదని, లేదంటే.. మేడిగడ్డ పరిస్థితే వస్తుందని.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులు చేసుకుంటూ.. ఇంజినీర్ల పని ఇంజినీర్లను చేసుకోనివ్వాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌లోని ఇంజినీర్స్ భవన్‌లో 57వ ఇంజినీర్స్ డే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 164వ జయంతి సందర్భంగా గుర్రం కోటిరెడ్డి మెమోరియల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

గుత్తా మాట్లాడుతూ.. ఇరిగేషన్ శాఖ అధికారులు నీతి, నిజాయితీ, నిబద్ధ్దతతో పని చేయాలని.. లేదంటే, రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాజెక్టులను నిర్మించాలి కానీ పార్టీ నాయకుల కోసం కట్టొద్దన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుంటే చాలా మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గోదావరి బేసిన్ లో ప్రాజెక్టుల నిర్మాణం పైన పెట్టిన శ్రద్ధ్దలో 50 శాతం కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులపై పెడితే ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు.