టాలీవుడ్ స్టార్ రామ్చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు, శిరీశ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం నుంచి రెండో పాట రిలీజ్కు సన్నాహాలు చేస్తోంది మూవీ టీమ్. ఈ ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమోను సెప్టెంబర్ 28న, 30న పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మందికి పైగా జానపద కళాకారులు ఈ పాటలో రామ్చరణ్తో కలిసి డాన్స్ చేయటం విశేషం. ఈ సాంగ్ విశేషాలను డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివరించారు.
డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ “రామ్చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ డిఫరెంట్గా చేద్దామని నేను, తమన్ అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్లోని సంస్కృతులను బేస్ చేసుకుంటే బాగుంటుందనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోని గుస్సాడి, కొమ్ముకోయ, తప్పెట గుళ్లు వంటి జానపద నృత్యాలను పాటలో భాగం చేయాలనుకున్నాను. వెస్ట్ బెంగాల్.. చౌ, ఒడిశా.. గుమ్రా, రానప్ప, పైకా, దురువతో పాటు కర్ణాటక.. హలారి. ఒక్కలిగ, గొరవర, కుణిత వంటి నృత్య రీతులనూ భాగం చేసేందుకు చాలా రీసెర్చ్ చేశాం. దీని వల్ల పాట సౌండింగ్ ఇదివరకు ఎన్నడూ విననంత కొత్తగా వచ్చింది” అన్నారు.