కూకట్పల్లి: ప్రశాంత్ నగర్ పాత కోర్టు భవనం ఎదురుగా ఉన్న స్మశాన వాటిక స్థలాన్ని కొందరు వ్యక్తులు తప్పుడు సర్వే నెంబర్లతో కబ్జా చేస్తున్నట్లు దయార్ గూడ బస్తివాసులు, స్థానికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం స్థానికులతో కలిసి స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 200లలో సుమారు 5 ఎకరాలకు పైగా భూమిని స్మశాన వాటిక కోసం వదలడం జరిగిందన్నారు. ఇందుకు ఆధారంగా రెవెన్యూ రికార్డులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు స్మశాన వాటిక కోసం రికార్డులో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. కబ్జాకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. జిహెచ్ఎంసి, రెవెన్యూ, పోలీస్ అధికారులు స్మశాన వాటిక కోసం వదిలిన స్థలాన్ని పరిశీలించి కబ్జాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.