బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జన్వాడ్లోని ఫామ్హౌస్ రేవ్ ఘటనకు సంబంధించి డీజీపీకి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్చేసినట్లు వార్తలు వస్తున్నాయని, ఇదే నిజమైతే అంతకంటే సిగ్గు చేటు ఉండదని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీసుల లాఠీల దెబ్బలకు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, ప్రజా సమస్యలపై కొట్లాడిన ఉద్యమకారులు విలవిలలాడితే కేసీఆర్ ఏనాడు నోరు మెదపలేదని మండిపడ్డారు.
పోడు భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులు, గర్భిణిలను జైల్లో వేసినప్పుడు, సిరిసిల్లలోని నేరెళ్ల దళితులపై దాడులు స్పందించని కేసీఆర్.. జన్వాడ ఫామ్ విషయంలో డీజీపీకి ఫోన్ చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ ప్రజల ప్రాణాలకంటే తన కుటుంబమే ఎక్కువైందా అని ప్రశ్నించారు. తప్పుచేసిన వాడిని దండించాలని చెప్పాల్సిందిపోయి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఫోన్ చేయడం తెలంగాణ ప్రజలకే అవమానమని ఆయన విమర్శించారు.