మేయర్ సహా 15 మంది మృతి
బీరుట్, అక్టోబర్ 16: దక్షిణ లెబనాన్లోని ఖనా నగరంపై మంగళ వారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ దాడు లు జరిపింది. ఈ దాడుల్లో మేయర్ అహ్మద్ కహిల్లో పాటు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ వెల్లడించారు. హెజ్బొల్లా మిలిటెంట్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో మేయర్ సహా పలువు రు ప్రాణాలు కోల్పోయారని, శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీయగా.. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని లెబనాన్ సివిల్ డిఫెన్స్ పేర్కొంది.
ఇప్పటివరకు 250 మందికి పైగా హెజ్బొల్లా ఫైటర్లు మరణించినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. వీరిలో 21 మంది కమాండర్లు ఉన్నట్లుగా స్పష్టం చేసింది. కాగా ఇజ్రాయెల్లోని బిన్యామినా ప్రాంతంలోని సైనిక స్థావరమే లక్ష్యంగా ఇటీవల హెజ్బొల్లా భీకర డ్రోన్ దాడి చేసింది. దక్షిణ లెబనాన్ గస్తీ కాస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళాలపై సైతం ఆదివారం ఇజ్రాయెల్ దాడులు చేయగా15 మంది సైనికులు గాయపడ్డారు.