calender_icon.png 14 March, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మీకి ఈ బడ్జెట్ సరిపోతుందా?

18-02-2025 12:00:00 AM

దోర్బల బాలశేఖరశర్మ :

కలలు కనడం గొప్ప కాదు. ఆ స్వప్నాల సాకారానికి కావలసిన బలం పుం జుకుంటున్నామా లేదా అన్నది ముఖ్యం. జాతీయ మీడియాలో ఇటీవల వచ్చిన రెండు ప్రముఖ అభిప్రాయాలు (ఒపీనియన్స్) మన దేశ ఆర్మీకి సంబంధించిన ఒక ఆలోచించదగ్గ అంశాన్ని చర్చకు తెచ్చా యి.

ఆధునిక సాంకేతికతలతో భారతీయ సైన్యం భవిష్యత్ అవసరాలకు సరిపడా అనూహ్య శక్తిని పొందడానికి తగిన ప్రణాళికలు రచిస్తున్నదని అంటూ ఆ తాలూకు విశేషాలు వెల్లడైనాయి. ఇదే సమయంలో, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యస్ఫూర్తిని దేశం సాధించే దిశగా ఇటీవల రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు జరగలేదని చెబుతూ ఇంత అత్యల్ప నిధులతో అంత గొప్ప లక్ష్యాన్ని ఎలా సాధిస్తారన్న ప్రశ్నను రేకెత్తిస్తూ మరో అభిప్రాయం వెలుగుచూసింది.

నిజానికి ఈ రెండు విషయాలూ కట్టుకథలైతే కావు. ప్రామాణికమై న గుర్తింపుగల విశ్లేషకులు జాతీయస్థాయి లో పేర్కొన్న వాస్తవిక అంశాలే అవి. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు, విధానాల మేరకే ఆ  అభిప్రాయాలు మీడియాలో వచ్చినట్లు ఆ విశ్లేషకుల విశ్వసనీయతనుబట్టి అర్థం చేసు కోవలసి ఉంది. 

బృహత్ లక్ష్యం వైపు భారత ఆర్మీ 

భవిష్యత్ యుద్ధభూమిలో ఆధిపత్యం చెలాయించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను భారత సైన్యం సమకూర్చుకుంటున్నదని చెబుతూ, తత్సంబంధ సమాచారాన్ని రిటైర్డ్ ఆర్మీ అధికారి, లెఫ్ట్‌నెంట్ జనరల్ అశోక్ భీమ్ శివేన్ ‘ఫస్ట్‌పోస్ట్’ న్యూస్‌పోర్టల్‌లో గతనెల రెండో వారం చివర్లో ప్రచురించారు.

భారత ఆర్మీ ఈ మేరకు తన కార్యాచరణ ప్రణాళికలను, సామర్థ్యాలను మార్చుకుంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘హౌ ఇండియన్ ఆర్మీ ఈజ్ మోడర్నయిజింగ్ టు బికమ్ ఫ్యూచర్ రెడీ ఫోర్స్’ శీర్షికన ప్రచురితమైన ఆ వ్యాసంలో రచయిత శివేన్ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

‘అత్యాధునిక ట్యాంకులు, ప్లాట్‌ఫామ్స్, సమన్వయంతో కూడిన దాడులకు స్వార్మ్ డ్రోన్లు, ఖచ్చితమైన దాడులకు ఆధునిక ఫిరంగిదళాలు, ప్రాణాంతక పదాతిదళ యూనిట్లతో, యాంత్రిక దళాలు వంటివాటితో యుద్ధశక్తి నైపుణ్యాలను కొత్త సాంకే తికతలతో భారత ఆర్మీ పునర్నిర్వచించుకుంటున్నది.

ఇంకా, కృత్రిమమేధ (ఏఐ) ఆధారిత సాంకేతికతలద్వారా నిర్ణయం తీసుకోవడం, అధునాతన కమ్యూనికేషన్లు, అన్ని భూభాగ సామర్థ్యాలు వంటి అత్యాధునిక ఆవిష్కరణలతో వేగవంతమైన సమాచారంతో కూడిన చర్యలను మన సైన్యం నిర్ధారించుకుంటున్నది.

‘వికసిత్ భారత్’ దార్శనికతకు వీలుగా, సుర క్షిత, సుసంపన్న, అత్యంత ప్రభావవంత భారతదేశాన్ని రూపొందించడంలో మన సైన్యం తనదైన కీలక పాత్ర పోషించడమే లక్ష్యంగా పెట్టుకుంది’ అని పై వ్యాసం వెల్లడించింది. ‘భవిష్యత్తుకు కావలసిన మేర శక్తి సముపార్జన కోసం ఆధునీకరణ దిశగా భారతీయ సైన్యం అడుగులు వేస్తున్నది.

ఈ పరివర్తనను స్వావలంబన, అత్యాధునిక సాంకేతికత, వ్యూహాత్మక ఏకీకరణ సూత్రాలద్వారా ఆర్మీ అంతటికీ కావలసిన మార్గనిర్దేశం చేస్తున్నది’అని వ్యాస రచయిత అశోక్ భీమ్ శివేన్ తెలిపారు. 

వ్యూహాత్మక మార్గదర్శకత్వం

‘వికసిత్ భారత్-2047’ స్వాతంత్య్ర శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ సాధన లక్ష్యంగా ప్రస్తుత బీజేపీ పాలక వర్గం ముందడుగు వేస్తున్నది. ఈ క్రమం లో యువత ప్రధాన పాత్ర పోషణను కేంద్రం గుర్తిస్తున్నది. వారి సమ్మిళిత అభివృద్ధి, స్థిరమైన పురోగతి కోసం సమర్థ వంతమైన పాలనపై వారు దృష్టి పెట్టారు.

దీని వ్యూహాత్మక మార్గదర్శకత్వం ఆత్మనిర్భరత (స్వయం-విశ్వాసం), సురక్షితమైన, స్థిరమైన సరిహద్దులు, భద్రతా దళాల ఆధునీకరణ, ప్రపంచ కామన్స్ చురుకైన ఆకృతి, అన్నింటికంటే మించి దేశం అనే స్ఫూర్తితో మోదీ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది’ అంటూ, ‘భారత సైన్యం ఆధునికీకరణ, జాతీయ ఆకాంక్షలతో కూడిన ఏకీకరణల కోసం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నట్టు’ ఆయన ఆ వ్యా సంలో తెలిపారు.

‘భారత సైన్యం-2047’ విజన్, ఆధునిక, చురుకైన, అనుకూలమైన, సాంకేతికత- ఆధారిత, స్వావలంబన భవిష్యత్తు- కోసం సంసిద్ధ శక్తిగా రూపాంతరం చెందడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి కార్యకలాపాలలో బహుళ -డొమైన్ వాతావరణంలో యుద్ధాలను నిరోధించగల, గెలువగల సా మర్థ్యం కలిగి ఉండేలా, తగురీతి సేవలు, సమన్వయంతో జాతీయ ప్రయోజనాల సంరక్షణ కార్యకలాపాలతో ఆర్మీ ముందు కు సాగుతున్నదని శివేన్ వివరించారు.

పరివర్తన దశాబ్దం

భారత సైన్యం జాతీయ లక్ష్యాలతో పూర్తిగా సమన్వయం చేసుకోవడం అత్యవసరం. అదే సమయంలో బలీయంగా, సంబంధితంగా, ఏదైనా కార్యాచరణ ఎదురైన తరుణంలో, ఆకస్మిక పరిస్థితులకు సిద్ధంగా ఉండటానికి నిరంతరం అభివృద్ధి చెందుతున్నది. ఈ లక్ష్యాలను సాధించడంలో, భారత సైన్యం ‘2023-2032’ పదేళ్ల కాలాన్ని ‘పరివర్తన దశాబ్దం’గా పా టిస్తున్నట్టు సమాచారం.

భవిష్యత్తు-కు సిద్ధమైన, సాంకేతికత- ఆధారిత, ప్రాణాంత కమైన, చురుకైన సైనిక శక్తిగా మారడానికి, అందుకు మార్గం సుగమం చేయడానికి 2024, 2025 సంవత్సరాలను ‘సాంకేతిక శోషణ సంవత్సరాలు’గానూ పరిగణిస్తున్నట్టు తెలుస్తున్నది. మొత్తం మీద రానున్న కాలంలో భారతదేశానికి ‘ఆత్మనిర్భరతే’ ముఖ్యలక్ష్యం కాబోతున్నది.

ఈ క్రమంలో రక్షణ తయారీ సాంకేతికతలో స్వావలంబన సాధనను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తు న ప్రోత్సహిస్తున్నది. కాగా, ఈ ఏడాదిని ‘సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించాలనే రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం ఈ సందర్భంగా గమనార్హం.

మన రక్షణరం గం పౌర పరిశ్రమల మధ్య సాంకేతిక బది లీ, జ్ఞాన భాగస్వామ్యాన్ని సులభతరం చేసే కార్యక్రమాలకు కేంద్రం శ్రీకారం చుడుతున్నదని రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ అశోక్ భీమ్ శివేన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల విశ్వ సనీయ ఎగుమతిదారుగా నిలబెట్టడంతోపాటు పరిశోధన, అభివృద్ధి రంగాలలో కావలసిన అన్ని ప్రోత్సహకాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సంకే తాలు అందుతున్నట్టు కూడా ఆయన అంటున్నారు.

సంకల్పానికి తగ్గ నిధులు ఏవి?

ఇదే సమయంలో పై అభిప్రాయాన్ని ప్రశ్నించే మరొక విశ్లేషణ కూడా తాజాగా జాతీయ మీడియాలో ప్రచురితం కావడం గమనార్హం. ఈ బృహత్ లక్ష్య సాధనకు అనుగుణమైన రీతిలో తాజా బడ్జెట్‌లో రక్షణరంగానికి కనీస కేటాయింపులు కూ డా జరగలేదని, ఇలాంటి పరిస్థితిలో అంత మహాసంకల్పం ఎలా కార్యరూపం దాలుస్తుందని మరో రిటైర్డ్ ఆర్మీ అధికారి హెచ్. ఎస్.పనాగ్ అభిప్రాయపడ్డారు.

2035 నాటికి చైనా తరహాలో బీజింగ్ సైన్యాన్ని సవాలు చేసే స్థితికి భారత ఆర్మీ చేరడం అన్నది ఒకింత ప్రశ్నార్థకమేనని ఆయన అన్నారు. ‘ది ప్రింట్’ డిజిటల్ మీడియాలో ఈనెల మొదటివారంలో ఆయన ప్రచురించిన వ్యాసం (‘ఇండియా కెనాట్ సిట్ ఎట్ హై టేబుల్ విత్ దిస్ బడ్జెట్, వికసిత్ భారత్ ఈజ్ ఇంపాజిబుల్’) ‘వికసిత్ భారత్-2047’ బృహత్ లక్ష్యసాధన ప్ర స్తుత అరకొర బడ్జెట్ (రూ.6,81,210. 27 కోట్లు)తో కష్టమేనని తెలిపారు.

2025- 26 సంవత్సరానికిగాను తాజా బడ్జెట్‌లో కేటాయించిన రక్షణరంగ కేటాయింపు గతేడాది (2024-25) కంటే 9.5 శాతం మా త్రమే ఎక్కువ. అదికూడా సవరించిన అం చనాల మేరకు, ఇంకా ద్రవ్యోల్బణం, దిగుమతులపై ప్రభావం చూపే డాలర్‌తో పో ల్చినప్పుడు మరింత తక్కువ(6.25 శాతం)కు దిగగలదని ఆయనన్నారు.

‘2049 నా టికి ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యాన్ని సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చైనా తో మన దేశం ఇంత తక్కువ బడ్జెట్ కేటాయింపులతో ఎలా పోటీ పడగలదు?’అన్న ప్రశ్నను ఆయన లేవనెత్తారు. కేంద్రం మన ఆర్మీ విషయంలో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందుకు ఆనందించాలా లేక తగిన నిధులు లేనందుకు విచారించాలా? ఇదీ ఇప్పుడు ప్రజల ముందున్న ప్రశ్న.