రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షవలె ఉండడం బాధాకరం. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో 8వ తరగతి విద్యార్థులు 2వ తరగతి పాఠాలైనా చదవలేక పోతున్నారని తేలింది. గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయలేకున్నారు. ఇదెంతో ఆందోళన కలిగించే విషయం.
రాష్ట్ర ప్రభుత్వం ‘పుండు ఒక దగ్గర ఉంటే చికిత్స మరోచోట చేస్తున్నట్టు’గా వ్యవహరిస్తున్నదని పలు విమర్శలు వస్తున్నాయి. పలువురు ఉపాధ్యాయులు శిక్షణ పొందకుండా విద్యా సంవత్సరం పూర్తి చేస్తుండడమూ పెద్ద సమస్యగానే ఉంటున్నది. మరోవైపు ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యార్హతలు ఉన్నా పదోన్నతులు లభించడం లేదు.
ఎందరో ఆశగా ఎదురుతెన్నులు చూసి చివరకు ప్రమోషన్లు లేకుండానే పదవీ విరమణ చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతి నియమాకాలు మరో సమస్య. ఈ ప్రభావాలన్నీ లక్షలాది మంది విద్యార్థులపై పడుతుండడంతో విద్యాభాస్యంలో నాణ్యత కొరవడుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.
డా. ఎస్. విజయ భాస్కర్, హైదరాబాద్