calender_icon.png 23 October, 2024 | 11:24 PM

రియల్టీలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 3 బిలియన్ డాలర్లు

06-07-2024 03:25:14 AM

న్యూఢిల్లీ, జూలై 5: దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ ఏడాది ప్రధమార్థంలో 65 శాతం వృద్ధిచెందినట్టు రియల్టీ కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. 2024 జనవరి మధ్యకాలంలో విదేశీ ఇన్వెస్టర్లు 3.1 బిలియన్ డాలర్లు పెట్టుబడి చేశారని వెల్లడించింది. ఈ రంగంలోకి వచ్చిన మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో విదేశీ సంస్థల ఇన్వెస్ట్‌మెంట్స్ 65 శాతమని పేర్కొంది. జనవరి మధ్యకాలంలో రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 62 శాతం వృద్ధిచెంది 2,939 బిలియన్ డాలర్ల నుంచి 4,760 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నది.

ఈ గణాంకాలకు భిన్నంగా మరో ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా ఇటీవల విడుదల చేసిన నివేదికలో రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 6 శాతం తగ్గి 3,764.7 మిలియన్ డాలర్ల నుంచి 3,523.6 మిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపింది. అయితే శుక్రవారం విడుదలైన జేఎల్‌ఎల్ రిపోర్ట్‌లో ఈ పెట్టుబడులు 4.8 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. 2023 మొత్తం సంవత్సరంలో దేశీయ రియల్టీ రంగం 5.8 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించగా, అందులో 81 శాతం మేర ఈ ఏడాది ప్రధమార్థంలోనే సాధించినట్టు జేఎల్‌ఎల్ వివరించింది. తాజా పెట్టుబడుల్లో 34 శాతం వేర్‌హౌసింగ్ రంగంలోకి వచ్చాయని, 33 శాతం రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లోకి, 27 శాతం ఆఫీస్ స్పేస్ విభాగంలోకి వచ్చినట్టు తెలిపింది.