calender_icon.png 4 October, 2024 | 2:57 AM

అంతర్జాతీయ సంకేతాలే కీలకం

09-09-2024 12:00:00 AM

  1. రిటైల్ ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటాపై దృష్టి 
  2. ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8:  ఈ వారం స్టాక్ మార్కెట్ కదలికలను ప్రధానంగా గ్లోబల్ సంకేతాలే నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెప్పారు. యూఎస్ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న సందేహాలు, చైనా జీడీపీ వృద్ధి పట్ల భయాలు నెలకొనడంతో గతవారం ప్రపం చ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ సూచీలు సైతం క్షీణతను చవిచూశాయి.

శుక్రవారం భారత్ మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా నిరుత్సాహపర్చడంతో అదే రోజున అమెరికా సూచీలు మరో భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఈ వారం సైతం ప్రపంచ మా ర్కెట్లకు అనుగుణంగానే భారత్ సూచీలు పయనిస్తాయని విశ్లేషకులు తెలిపారు.   గత వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,182 పాయిం ట్లు క్షీణించి 81,184 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 384 పాయింట్లు తగ్గి 24,852 పాయింట్ల వద్ద నిలిచింది. 

ఈ వారం విడుదలయ్యే రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామి కోత్పత్తి వృద్ధి రేటు తదతర గణాంకాలపై సైతం  దేశీయ ఇన్వెస్టర్లు దృష్టి నిలుపుతారని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్పారు. మరోవైపు త్వరలో జరగబోయే యూఎస్ ఫెడ్ కమిటీ మీటింగ్‌లో ఎంతమేరకు వడ్డీ రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయన్నారు.

జూలై నెల పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) డేటా, ఆగస్టు నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ గురువారం వెలువడతాయి. యూఎస్ ఫెడ్ నిర్ణయం సెప్టెంబర్ 18న వెలువడుతుంది. సమీప భవిష్యత్తులో మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ లో కొనసాగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖెమ్కా చెప్పారు. 

అలాగే త్వరలో వెల్లడయ్యే యూఎ స్ ద్రవ్యోల్బణం గణాంకాల్నీ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. 

ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ. 11,000 కోట్లు

ఈ సెప్టెంబర్ తొలివారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీ య ఈక్విటీల్లో రూ. 11,000 కోట్ల నికర పెట్టుబడులు జరిపారు. ఏప్రిల్, మే నెలల్లో రూ. 34,000 కోట్ల మేర వెనక్కు తీసుకు న్న ఎఫ్‌పీఐలు జూన్ నుంచి క్రమేపీ భారత మార్కెట్లో కొనుగోళ్లు జరుపుతున్నారు. భారత్  సూక్ష్మ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నందున విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. అయితే యూఎస్ వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎఫ్‌పీఐల పెట్టుబడుల శైలిని ప్రభావితం చేస్తాయన్నారు.

యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 3.7 శాతానికి తగ్గడంతో భారత్‌తో సహా ఇతర వర్థ మాన మార్కెట్లలో పెట్టుబడులకు ఎఫ్‌పీఐలు ఆసక్తి చూపిస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. కానీ యూఎస్ వృద్ధి పట్ల ఆందోళనలు, అధిక మార్కెట్ విలువలు రానున్న రోజు ల్లో ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని, భారత్ మార్కెట్ తగ్గుదలను ఎఫ్‌పీఐలు కొనుగోళ్లకు అవకాశంగా మలుచుకుంటారని విజయకుమార్ వివరిం చారు.

నిఫ్టీ ప్రధాన మద్దతు 24,600

గత శుక్రవారం యూఎస్ మార్కెట్ల క్షీణత ప్రభావంతో ఈ వారపు దేశీయ ట్రెండ్‌ను సూచించే  గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్ల మేర తగ్గింది. దీంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో నిఫ్టీ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిఫ్టీ సూచికి 24,600 సమీపంలో లభించబోయే మద్దతు ప్రధా నమైనదని ఆనంద్ రాఠి సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ గణేశ్ డోంగ్రే తెలిపారు.

గత వారం నిఫ్టీ 24,800 14,900 మద్దతు శ్రేణిలో ముగిసిందని, తదుపరి కీలక మద్దతు 24,600 వద్ద లభిస్తున్నదని, ఈ స్థాయిని పరిరక్షించుకుంటే నిఫ్టీ రానున్న రోజుల్లో మరో దఫా 25,200 శ్రేణిని అందుకునే అవకాశం ఉంటుందన్నారు. 24,600 మద్దతును కోల్పోతే 26,450 పాయింట్ల వరకూ తగ్గవచ్చని అంచనా వేశారు.