19-03-2025 01:28:55 AM
కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 18 (విజయ క్రాంతి) జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కొరకు విద్యుత్తు లైన్ ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పోడు వ్యవసాయంకు విద్యుదీకరణ, ఉపాధి హామీ పనుల పురోగతి, త్రాగునీటి సంరక్షణ చర్యలు, మొక్కల పెంపకం, ఇంకుడు గుంతలు త్రవ్వకాలు, మీసేవ దరఖాస్తులు, ధరణి ,ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు పట్టాలు పొందిన రైతులు వ్యవసాయం చేయడానికి వీలుగా నీటి వసతి కల్పించుటకు గాను వ్యవసాయ భూములకు విద్యుదీకరణ కు అవసరమైన లైన్ల ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఎక్కడ అయితే విద్యుత్తు లైన్లు అవసరమో పంచాయతీ సెక్రటరీ గుర్తించి, విద్యుత్ లైన్ల మంజూరుకు అవసరమైన పత్రాలు, గ్రామసభ ఆమోదంతో అటవీశాఖ అధికారులకు తెలపడం ద్వారా విద్యుత్ లైన్లు ఏర్పాటు చెయ్యాలన్నారు. విద్యుత్ లైన్ల ఏర్పాటు సాధ్యం కానీ ప్రదేశాలలో అటవీ శాఖ అధికారుల ఆమోదంతో బావులు త్రవ్వి సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు తో పోడు సాగుకు నీటి సౌకర్యం కల్పించాలన్నారు.
పోడు భూములలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, అడిషనల్ డి ఆర్ డి ఓ రవి, పంచాయతీ రాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, ఎస్సీ సంక్షేమ అధికారి అనసూర్య, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, మిషన్ భగీరథ నలిని, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు