12-03-2025 12:00:00 AM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్
కాటారం (భూపాలపల్లి) మార్చి 11 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, నిర్దేశించిన సమయాలలో తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని వైద్యాధికారులు క్రమం తప్పకుండా సబ్ సెంటర్లను సందర్శించాలని, అలాగే పి హెచ్ సి లను జిల్లా ప్రోగ్రాం అధికారులు పరిశీలించాలని పేర్కొన్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలన్నారు. జ్వర బాధితులను పరీక్షించి, రక్త నమూనాలు సేకరించి, మలేరియా తదితర పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
వేసవికాలం దృష్ట్యా వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకునే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని సూచించారు. ఓ ఆర్ ఎస్ పాకెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కాలేశ్వరం వద్ద జరగనున్న సరస్వతి పుష్కరాలకు వైద్య శిబిరాల నిర్వహణ ప్రగతి ప్రణాళికలను తయారు చేయాలని ఆదేశించారు.
టీవీ ఎన్సీడీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ల పనితీ రును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రవి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.