28-03-2025 01:10:56 AM
వనపర్తి టౌన్ మార్చి 27: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదర్శించారు.గురువారం కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు.ఆస్పత్రిలో రోగులకు కావాల్సిన వసతులపై కలెక్టర్ ఆరా తీశారు.ఆస్పత్రికి వచ్చే బాలింతలు,తల్లులు పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని సూచించారు.
ఎన్ సి డి క్లినిక్ ను, అదేవిధంగా,మైత్రి ట్రాన్స్( ట్రాన్స్ జెండర్) క్లినిక్ ను కలెక్టర్ తనిఖీ చేశారు.సిటీ స్కాన్ ఏర్పాటు కోసం సిద్ధం చేస్తున్న గదిని పరిశీలించి టీజీ ఎస్ ఎమ్ ఐ డి సి ఇంజనీరింగ్ విభాగం డిఈకి పలు సూచనలు చేశారు.అనంతరం,డయాలసిస్ విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ రోగులకు ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు,వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనుల తనిఖీ
జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో నిర్మాణంలో ఉన్న రెండు లెక్చర్ హాల్స్ ని నెల రోజుల్లోపు పూర్తి చేసి అప్పగించాలని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా హాస్టల్ భవనాలను సందర్శించిన కలెక్టర్ నెలన్నర లోపు పూర్తి చేసి విద్యార్థులకు వసతి కల్పించేందుకు అప్పగించాలని ఆదేశించారు.
ఇక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మొత్తం ఆగస్టు లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రంగారావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్మయి, ఎన్ సి డి డాక్టర్ రామచంద్ర, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.