తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయడం లేదు
తెలంగాణలోనూ తమిళనాడు విధానాన్నే పాటించాలి
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయకుండానే గత ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసిందని ఆయన విమర్శించారు.
శుక్రవారం మల్లన్న సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు వల్ల ఇటీవల జరిగిన డీఎస్సీలో 1,100 ఇతర కులాల అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు.
బీజేపీ తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తమిళనాడు రాష్ట్రం అమలు చేయడం లేదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సీఎం రేవంత్రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తెలంగాణలోనూ తమిళనాడు లాంటి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.