25-07-2024 12:05:00 AM
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ
ముషీరాబాద్, జూలై 24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని యావత్ బీసీలకు మరోసారి అన్యాయం జరిగిందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ విమర్శించారు. రూ.48 లక్షల కోట్ల బడ్జెట్లో 85 కోట్ల బీసీలకు కేవలం రూ.3,300 కోట్లు కేటాయించడం దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాచిగూడ లోని ఓ హాటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలు ధర్మాన్ని, మతాన్ని మోయడానికి తప్ప అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతోనే బడ్జెట్ కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తక్షణమే మంత్రి పదవికి, పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమా వేశంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కోల జనార్ధన్, నాయకులు జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, నంద గోపాల్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.