calender_icon.png 23 October, 2024 | 3:05 AM

ఉద్యమకారులకు అన్యాయం

11-07-2024 01:30:00 AM

కోనేరు సాయికుమార్ :

తెలంగాణ వస్తే తమ ప్రాంతం బాగుపడుతుందని, తనతో పాటు తన భావితరాల భవిష్యత్తు బాగుంటుందని భావించి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో పోరాటం చేసిన ఓ ఉద్యమకారుడు, ఇప్పుడొచ్చిన తెలంగాణతో ఈ సమజానికి ఏం ఒరిగిందని వాపోతున్నాడు. ఉద్యమకాలంలో తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేద్దాం అంటు తమను ఎగేసిన కేసీఆర్, తెలంగాణ వచ్చాక ఆంధ్రా పెట్టుబడిదారులు, వలసవాదులకు ఊడిగం చేసిన నాయకులను అందలం ఎక్కించాడు. ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా తెలంగాణను దోపీడి చేశారో, వారినే ప్రభుత్వ అధికారులు పక్కాన చేర్చుకున్నారని ఉద్యమకారుడు కోనేరు సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమకారుడు సాయికుమార్ తొలి, మలి దశ ఉద్యమానికి సంబంధించి ప్రత్యేక కథనం.   

1957లో నిజామాబాద్ జిల్లాలో జన్మిం చాను. నగరంలోని ఖలీల్‌వాడి గుర్బాబది పాఠశాలలో  పదో తరగతి వరకు చదివాను. తర్వా త జూనియర్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్, గిరిరాజ్ కళాశాల నుంచి బీఏ చదివాను.  అనంతరం కాకతీయ యూనివర్శిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నాను.  మొదటిసారి సీనియర్ విద్యార్థులతో కలిసి నిజామాబాద్ నగరంలోని తిలక్‌గార్డెన్ టౌన్‌హాల్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాను.

ఆ సమావేశంలో వక్తలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై వివరించారు.  ఉద్యమంలో భాగంగా అనేక సార్లు స్కూల్లో తరగతుల బహష్కరించారు. అనంతరం హైదారాబాద్‌లో జరిగిన సమావేశానికి సీనియర్లతో కలిసి ట్రైన్‌లో వెళ్లాను. అయితే ఆ సమయంలో విద్యార్థులపై కాల్పులు జరగడంతో మేం ఒక్కరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోనే తలదాచుకున్నాము.  రెండో రోజు నిజామాబాద్ వచ్చి.. విద్యార్థులపై జరిపిన కాల్పులకు నిరసనగా నిజామాబాద్ బంద్‌కు పిలుపునిచ్చాం. 

2001వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో డిప్యూటి స్పీకర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాదులతో తన నివాసంలో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఆ సమావేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులతో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి ఏఎస్. పోశెట్టితో పాటు పలువురు నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఆ సమావేశాల్లో కేసీఆర్ టీడీపీని వీడి తెలంగాణ ఉద్యమం చేసేందుకు ముందుకు రావడం, తమ చిరకాలవాంఛా కేసీఆర్ రూపంలో తీరబోతున్నందుకు సంతోషించాం. అలా కేసీఆర్ పిలుపుతో మళ్లీ ఉద్యమం రాష్ట్రమంతా ఉధృతమైంది.  2001వ సంవత్సరంలో కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించడంతో అందరం టీఆర్‌ఎస్ పార్టీలో చేరాం.

టీఆర్‌ఎస్ పార్టీలో జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు నాకు అప్పగించారు. 2004వ సంవత్సరంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశాను.  ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలో 36 జడ్పీటీసీ స్థానాలకు గాను 19 స్థానాల్లో గెలిపించాం.  2009లో రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొనడంతో రైల్వేపోలీసులు నాపై కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడ 20 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించాను. తర్వాత బెయిల్ పై విడదలయ్యాను.  కేసీఆర్ నిరహారదీక్ష సందర్భంగా జరిగిన ఉద్యమంలో  ఐదు రోజులపాటు నిజామాబాద్ జైళ్ళో శిక్ష అనుభవించా. 2011లో హైదరాబాద్‌లో జరిగిన రైల్ రోకో పాల్గొనందుకు మళ్లీ మరో కేసు నమోదైంది. 

పోలీసు కేసులు, ఉద్యమాల నడుమ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం సంతోషాన్నిచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులతో వ్యవహరించిన తీరు తీవ్ర మనస్తాపనికి గురిచేసింది. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఉద్యమకారులను అస్సలు పట్టించుకోలేదు.  రాష్ట్రం వచ్చాక తాము ఎవరికైతే వ్యతి రేకంగా పోరాడామో వారితోనే కేసీఆర్ జతకట్టారు.  అధికారంలోకి వచ్చాక పార్టీలో, ప్రభుత్వంలో ఆం ధ్ర పెట్టుబడిదారులు, వలసవాదుల అనుచరుల్ని చేర్చుకుని తెలంగాణ వాదుల్ని బయటకు పంపించారు.

ఉద్యమకారులకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారు. అదే కసితో తెలంగాణ ఉద్యమకారులంతా ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి కంకణం కట్టుకుని పని చేశారు. దాని ఫలితమే రాష్ట్రంలో కాంగ్రె స్ పార్టీ గెలవడానికి కారణం అనుకుంటున్నాను. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో విద్యార్థి నేతగా పాల్గొని.. నా న్యాయవాద వృత్తిని సైతం పక్కన పెట్టాను. ఇప్పుడు తలుచుకుంటే బాధేస్తది. జీవితం అంతా తెలంగాణ కోసం బతికాను.. సంపాదించింది ఏం లేదు. బిడ్డ పెళ్లి చేసేందుకు ఉన్న ఇంటిని సైతం అమ్ముకుని రోడ్డున పడ్డాను. కనీసం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమైన న్యాయం చేస్తే బాగుండేది.  

 శ్యామ్, నిజామాబాద్, విజయక్రాంతి