నిర్మల్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని మండల ప్రజలు, రైతులు పేర్కొన్నారు. ఇథనాల్ ప్యాక్టరీని రద్దు చేయాలంటూ దిలావర్పూర్ మండల కేంద్రంలో చేపట్టిన దీక్షలో సోమవారం మహిళా రైతులు కూర్చుని నిరసన తెలిపారు. అధికారులు పనులు నిలిపివేస్తామని హామీ ఇచ్చినా పనులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల మహిళా రైతులు, చిన్నారులు పాల్గొన్నారు.