రాత్రివేళ బైక్ల నుంచి అపహరణ
జనగామ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): జనగామలో కొన్ని రోజులుగా పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాల్లో ఆగంతకులు పెట్రోల్ మాయం చేస్తున్నారు. రాత్రివేళ ఓ దొంగల ముఠా కాలనీల్లో తిరుగుతూ ఇండ్ల ముందు నిలిపిన ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ను చోరీ చేస్తోంది. దీంతో ఇంటి ముందు వాహనం నిలపాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
మూడు రోజుల క్రితం జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీలో అర్ధరాత్రి రెండు బైక్లపై నలుగురు యువకులు సంచరించారు. ఓ ఇంటి ముందు మూడు బైక్లు పార్క్ చేసి ఉండగా అందులోని పెట్రోల్ను బాటిల్లో నింపుకుని వెళ్లిపోయారు. రెండు రోజుల క్రితం పట్టణ శివారులోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటి ముందు నిలిపిన బైక్లో సుమారు 4 లీటర్ల పెట్రోల్ను చోరీ చేశారు.
బుధవారం ఉదయం సంజయ్నగర్లోని మినీ స్టేడియం పెద్ద మోరీ వద్ద బైక్లోని ఐదు లీటర్ల పెట్రోల్ మాయం చేశారు. ఇలా రోజూ బైకుల్లో పెట్రోల్ మాయం కావడం పరిపాటిగా మారింది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి చోరీలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.