11-03-2025 01:17:15 AM
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
బాన్సువాడ, మార్చి 10( విజయ క్రాంతి) ః బాన్సువాడ గ్రామీణ మండలం నాగారం గ్రామంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ర్ట ఆగ్రోస్ ఛెర్మైన్ కాసుల బాలరాజు లు హాజరయ్యారు.
ఈసందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఏటువంటి పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుంద న్నారు. గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఇండ్లు లేని నిరుపేదలు దరఖాస్తు పెట్టుకున్నారు, 79 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ 5 లక్షల రూపాయలు ఇంటి ఆడబిడ్డ పేరుతో పూర్తిగా ఎటువంటి టాక్సులు లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఎకౌంటులోకి జమ చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క ఇంటికి రూ. 5 లక్షల నిధులను నాలుగు విడతలుగా విడుదల అవుతాయని, బేస్మెంట్ లెవెల్ వరకు రూ.1 లక్ష, లెంటెల్ వరకు రూ. 1 లక్ష ,స్లాబ్ పూర్తి అయిన తరువాత రూ.2 లక్షలు, ఇళ్ళు మొత్తం పూర్తి నిర్మాణం, రంగులు, బాత్ రూమ్, టాయిలెట్ నిర్మాణం పూర్తి అయిన తరువాత చివరి విడత రూ.1 లక్ష లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ,ఇతర అధికారులు, బాన్సువాడ మండల ప్రజాప్రతినిధులు,నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.