calender_icon.png 30 September, 2024 | 11:02 AM

దసరానాటికి ఇందిరమ్మ కమిటీలు

26-09-2024 03:56:11 AM

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు

విధివిధానాలు రూపొందించాలి 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం  

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో సమీక్ష 

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే దక్కాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు,  మండలం, పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఒకటి రెండు రోజుల్లో విధివిధానాలను రేవంత్‌రెడ్డి సూచించారు.

ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్‌యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే ఈ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందని, ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ఠ  సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కూడా రాబట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎప్పటికప్పుడు డాటాను అప్‌డేట్ చేయాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు సీఎంకు వివరించగా.. అవసరమైతే అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. 

రాజీవ్ గృహకల్ప ఇళ్లకు వేలం..

రాజీవ్ గృహకల్పలో నిర్మించి నిరూపయోగంగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లను వేలం వేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదని, వెంటనే వాటిని వేలం వేయడానికి రంగం సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని అధికారులను సీఎం ప్రశ్నించారు.

అర్హులందరికీ ఇళ్లు ఇచ్చి, సమస్యను పరిష్కరిం చాలని సూచించారు. సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీ శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీసీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.