calender_icon.png 8 October, 2024 | 5:07 AM

వరుసగా ఆరో రోజూ నష్టాల్లో సూచీలు

08-10-2024 02:46:38 AM

24,800 దిగువకు నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఐటీ స్టాక్స్ అండతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. తీవ్ర ఒడుదొడుకుల మధ్య ఆరంభ లాభాలు కోల్పోయి వరుసగా ఆరో రోజూ నష్టపోయాయి. ముఖ్యంగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వంటి కారణాలతో పతనమయ్యాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర పతనం కాగా.. నిఫ్టీ 24,800 స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 81,926.99 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,688.45) లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,137.77 వద్ద గరిష్ఠాన్ని తాకింది. తర్వాత నష్టాల్లోకి జారుకున్న సూచీ.. 80,726.06 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 638.45 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 218.85 పాయింట్ల నష్టంతో 24,795.75 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 79.46 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2674 డాలర్ల వద్ద కొనసాగుతోంది.