లెబనాన్లో 600 మంది శాంతి పరిరక్షకులు
ఐరాస క్యాంపులపై ఇజ్రాయెల్ వైమానిక దాడి
బీరుట్, అక్టోబర్ 11: లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఘర్షణతో భారత సైనికులు ప్రమాదంలో పడ్డారు. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో శాంతి స్థాపనలో భాగంగా బ్లూలైన్ వద్ద 600 మంది భారత సైనికులు కాపలా కాస్తున్నారు. వీరంతా ఐరాస శాంతి పరిరక్షణ దళంలో భాగంగా పనిచేస్తున్నారు.
హెజ్బొల్లాపై దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఐరాస స్థావరాలపై కూడా బాంబు దాడులు చేస్తున్నది. దీంతో భారత సైనికులకు ముప్పు ఏర్పడింది. ఈ దాడులపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. పరిస్థితిని దగ్గరి నుంచి గమనిస్తున్నామని, ఐరాస స్థావరాలను అందరూ గౌరవించాలని అని భారత విదేశాంగశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
లెబనాన్లో భూతల దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలు గురువారం కనోరాలోని ఐరాస శాంతి దళాల ప్రధాన కార్యాలయంపై దాడులు చేయటంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. భారత ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించింది. ఐరాస క్యాంపులను హెజ్బొల్లా గెరిల్లాలు రక్షణ కవచాలుగా వాడుకొని తమ బలగాలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించింది.