calender_icon.png 23 October, 2024 | 12:52 PM

భారతీయుడు-2.. టికెట్ ధరల పెంపునకు ఓకే

11-07-2024 12:05:00 AM

* రేవంత్ రెడ్డి సర్కార్ నిబంధనలు అమలుచేయనున్న మొదటి సినిమా ఇదే! 

‘భారతీయుడు-2’ చిత్రబృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75 పెంచుకునేందుకు వెలుసుబాటు కల్పించింది. సినిమా విడుదలైన రోజు నుంచి ఈ నెల 19వ తేదీ వరకు ధరల పెంపునకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి వారం రోజులు అదనంగా ఐదో షో కూడా ప్రదర్శించుకోవచ్చనీ పేర్కొంది. అయితే, షో ప్రారంభానికి ముందు డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే షరతు పెట్టింది. ఫిల్మ్ మేకర్స్ విజ్ఞప్తుల నేపథ్యంలో టికెట్ల పెంపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు చేసిన విషయం తెలిసిందే.

అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో సినీ ప్రముఖులు సామాజిక బాధ్యత వహించాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ సూచించింది. ప్రభుత్వ నిబంధనలు అమలు చేయనున్న మొదటి సినిమా ‘భారతీయుడు-2’ కావటం గమనార్హం. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా తెరకెక్కించిన సినిమా ‘భారతీయుడు-2’. శంకర్-కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సర్కార్ నిబంధనలను పాటిస్తామని చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వెల్లడించగా, అది త్వరలో అమలు కానుంది.