02-04-2025 12:25:14 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: అంతరిక్షం నుంచి చూస్తే భారత్ అద్భుతంగా ఉందని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో 286 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి.. ఇటీవలే భూమికి తిరిగొచ్చిన సునీత, తన సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్లు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి చూస్తే భారతదేశం ఎలా కనిపించిందో తన అనుభవాలను వివరించారు. ‘భారత్ అద్భుతమైన దేశం. మేము హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతిసారి విల్మోర్ హిమాలయాల ఫొటోలు తీశారు. అందమైన హిమాలయాలను చూసి నేను ఎంతో మురిసిపోయా.
హిమాలయాలు ఒక అలలా భారత్లోకి ప్రవహిస్తున్నాయి. నా తండ్రి స్వదేశానికి రావాలని నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. అంతరిక్షంలో నా అనుభవాలను భారత్లోని బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని ఉంది. భారత వ్యోమగామి ఆక్సియామ్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లడంపై నేను ఎంతో ఆనందంతో ఎదురుచూస్తున్నా.
భారత్ గొప్ప దేశం. అక్కడున్న ప్రజాస్వామ్యం అద్భుతం. ’ అని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో పెరుగుతున్న భారత పాత్రపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తూర్పు నుంచి పశ్చిమ దిశగా వెళ్తున్నపుడు గుజరాత్, ముంబై తీరప్రాంతంలో కనిపించిన కాంతులను గురించి కూడా వివరించారు.
ఈ కాంతులు ఎలాగైనా ఇక్కడకు రావాలని అనిపించేలా చేశాయని తెలిపారు. సునీత వ్యాఖ్యలు నాసా, ఇస్రో మధ్య బలోపేతం అవుతున్న బంధాన్ని ప్రతిబింభించాయి. ‘నిసార్’ మిషన్ను కూడా ఈ రెండు చేపట్టబోతున్నాయి.