19-03-2025 12:38:19 AM
ప్రధాని పాడ్కాస్ట్పై పాక్ అభ్యంతరం
పాక్ వ్యాఖ్యలను తిప్పి కొట్టిన భారత్
న్యూఢిల్లీ: లెక్స్ ఫ్రిడ్మన్ పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గురించి ప్రధాని స్పందిస్తూ.. ‘పాక్ భారత్తో ప్రాక్సీ యుద్ధం చేస్తోంది. నేను నా ప్రమాణస్వీకారానికి పాక్ పెద్దలను ఆహ్వానించాను. ఏండ్లుగా ఇలా ఎవరూ చేయలేదు. చాలా మంది నా నిర్ణయాన్ని తప్పుబట్టారు. సార్క్ దేశాల ప్రతినిధులందరినీ నేను ఆహ్వానించాను. శాంతి కోసం మేము ప్రయత్నించిన ప్రతిసారి మాకు నిరాశే ఎదురైంది’. అని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ తప్పుబట్టింది. మోదీ వ్యాఖ్యలు మరీ ఏకపక్షంగా ఉన్నాయంది.
తిప్పికొట్టిన భారత్
ప్రధాని మోదీ పాడ్ కాస్ట్ వ్యాఖ్యలను పాక్ తప్పుబట్టంపై భారత్ స్పందించింది. ‘ప్రధాని వ్యాఖ్యలు తప్పుబదోవపట్టించేలా ఉన్నాయి’ అని పాక్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ స్పందించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ‘శాంతికి అతిపెద్ద అడ్డంకి పాకిస్తాన్. ఇస్లామాబాద్ అబద్దాలు ప్రచారం చేస్తోంది. భారత భూభాగంలో అక్రమంగా ఉంటున్న పాక్ వెంటనే ఖాళీ చేయాలి. పాక్ క్రాస్ బోర్డర్ టెర్రరిజంను స్పాన్సర్ చేస్తోందని ఆ దేశం జమ్మూకశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలు తెలుపుతున్నాయి. అబద్దాలు ప్రచారం చేసే బదులు.. పాకిస్తాన్ భారత భూభాగాలను ఖాళీ చేయాలి’. అని విదేశాంగ శాఖ పేర్కొంది.