calender_icon.png 23 October, 2024 | 6:53 AM

రద్దీ ఏరియాల్లో బస్సులు పెంచుతాం

23-10-2024 02:44:52 AM

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ ప్రాంతంలో కిక్కిరిసిపోయిన బస్సులో విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేసిన అంశం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన మంగళవారం స్పందించారు. విద్యార్థులు ఫుట్ బోర్డుపై ప్రయాణించిన అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతమైన రద్దీ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

రద్దీకి తగ్గట్లుగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు. విద్యార్థులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సజ్జనార్ హామీ ఇచ్చారు. వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకుని ఫుట్ బోర్డు ప్రయాణం చేయవద్దని విద్యార్థులకు సూచించారు.