27-03-2025 01:27:56 PM
బిఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నాశనం చేస్తుందని బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్(R.S. Praveen Kumar) అన్నారు. కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్న రాష్ట్రానికి విద్య శాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకువడం లేదని, అసలు ఇంటలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
నకిరేకల్ లో పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు ప్రశ్నా పత్రం లీకేజీ కావడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనను పక్కకు పెట్టి ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యలు తీసుకోవడానికే పనిచేస్తున్నారని ప్రజా సంక్షేమం పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్.సి,ఎస్.టి,బి.సి గురుకులల్లో చదువుతున్న 68 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్న పాపం ఈ కాంగ్రెస్ పార్టీకె దక్కుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలన చెయ్యడం రాకుంటే తప్పుకోవాలని గాని ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.