calender_icon.png 15 March, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదాయం మస్తు అప్పుల సుస్తు!

15-03-2025 12:51:22 AM

ఆదాయం 339%.. అప్పులు 435% పెరిగాయ్

  1. పదకొండేళ్లలో ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
  2. సొంత రాబడికి కంటే.. అప్పులపైనే ఫోకస్ పెట్టిన ప్రభుత్వాలు
  3. ఏ ఏడాది కూడా అంచనాలను అందుకోని ఆమ్దానీ 
  4. 11 ఏళ్లలో ఎనిమిదేళ్లు అంచనాలు దాటిపోయిన ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలు
  5. కాళేశ్వరానికి పునాది తర్వాత అమాంతం పెరిగిన అప్పులు
  6. అప్పులు, ఆదాయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందూదొందే
  7. రోజురోజుకూ దిగజారుతున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి
  8. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులపై బహిరంగంగానే సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన
  9. 2025 పద్దు వాస్తవానికి దగ్గరగా ఉంటుందా? అని అనుమానాలు!

హైదరాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): రాష్ట్ర ఖజానా తీవ్రమైన ఒడిదొడు కులను ఎదుర్కొంటున్న వేళ.. రాష్ట్ర ప్రభు త్వం 2025-26 బడ్జెట్‌ను ఈ నెల 19న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత 11 ఆర్థిక సంవత్సరాలు ముగిసి.. 12వ ఆర్థిక సంవత్సరం లోకి తెలంగాణ అడుగుపెట్టబోతోంది.

దశాబ్ద కాలం నిండిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి నానాటికీ దిగజారుతుందే కానీ, కుదుటపడ్డ దాఖలాలు కనిపించడంలేదు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోం దని బహిరంగ వేదికలపై చెప్పడం.. ప్రభు త్వ దీనస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్ర ఆర్థిక గణాంకాలు కూడా సీఎం మాటల ను మరింత బలపర్చేలా ఉండటం గమనార్హం.

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ సొంత ఆదాయం 339శాతం పెరగ్గా.. అప్పులు మాత్రం ఏకంగా 435శాతం పెరగడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది బడ్జెట్‌లో సొంత రాబడులను రూ.80,090.33కోట్లుగా ప్రభుత్వం అంచనా వేయగా.. వచ్చింది కేవలం రూ. 49,779.27కోట్లు మాత్రమే. అంటే ఇది బడ్జెట్ అంచనాల్లో 62.15శాతమే.

2023 -24లో రాష్ట్ర  సొంత ఆదాయం రూ. 2.16లక్షల కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ రూ.1.69లక్షల కోట్లు (78.08) మాత్రమే వచ్చింది. 2014-15తో పోల్చితే 2023-24 నాటికి ఆదాయం 339.67శాతం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం అయితే పరిస్థితి మరి అధ్వానంగా మారింది. కనీసం గతేడాది వచ్చిన ఆదాయ కూడా రాకపోవడం ప్రభుత్వ ఆర్థిక దీనస్థితిని తెలియజే స్తోంది.

2024-25 ఏడాదిలో జనవరి నాటికి ప్రభుత్వానికి వచ్చిన సొంత ఆదా యం రూ.1.23 లక్షల కోట్లు. కానీ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.2.21లక్షల కోట్లు అంచనా వేసింది. గతేడాది జనవరి నాటికి ప్రభుత్వానికి రూ.1.36లక్షల కోట్లు వచ్చింది. గతేడాది కంటే ఈసారి పెరగాల్సిన ఆదాయం తగ్గడం ప్రభుత్వాన్ని మరింత కలవరానికి గురిచేస్తోంది. 

అప్పులు పెరుగుడే కానీ తగ్గుడు లేదు

గతంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కారు అయి నా.. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా అప్పుల విషయంలో ఎవరూ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. గత 11ఏళ్లలో అప్పులు ఏకంగా 435శాతం పెరగడం గమనార్హం. 2014-15లో ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో కేవలం 77శాతం మాత్రమే రుణాలను తీసుకొంది. 2016లో బీఆర్‌ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

అప్పటి నుంచి అప్పులు అమాం తం పెరిగాయి. బడ్జెట్ అంచనాలను దాటి 2016లో 136.02 శాతం, 2017లో అత్యధికంగా 152.30 శాతం, 2018లో 102.46 శాతం రుణాన్ని ప్రభుత్వం తీసుకొంది. ఇలా ప్రతి ఏడాది బీఆర్‌ఎస్ సర్కారు బడ్జెట్ అంచనాలకు మించి రుణాలను తీసుకోవడంతో రాష్ట్రంపై తీవ్రమైన భారం పడటం మొదలైంది.

కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత తాము అప్పులను తగ్గించుకుంటామని ప్రకటించింది. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే ప్రభుత్వం 118.94 శాతం అప్పులను చేసింది. ఫిబ్రవరి, మార్చి నివేదికలు వస్తే.. అది 140శాతం చేరిన ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇలా, ఏడాదికేడాది అప్పులు పెరగడంతో వాటికి కంటే వడ్డీలు, ప్రిన్సిపల్ అమౌంట్‌లు భారీగా చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రానికి నెలకు వస్తున్న 18వేల కోట్ల ఆదాయంలో 6,500 కోట్లు మిత్తీలకే చెల్లిస్తున్నారంటే.. ఖజానాపై భారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

2025-26 బడ్జెట్ ఎలా?

బడ్జెట్‌లో సొంత రాబడులు, అప్పులను కలిపి మొత్తం ఆదాయంగా పరిగణిస్తారు. సొంత రాబడులు ఎంత ఎక్కువగా వస్తే రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత పటిష్ఠంగా ఉం టు ంది. సీఎం రేవంత్‌రెడ్డే ఆర్థిక పరిస్థితిపై ఆవేదన చెందుతున్న సమయంలో 2025-26 బడ్జెట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వస్తున్న వాస్తవ ఆదాయాన్ని లెక్కగట్టి.. దానికి 10 నుంచి 15 శా తం పెంచి ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.

వాస్తవ గణాంకాల ఆధారంగా బడ్జె ట్‌ను ప్రవేశపెడితే.. మొత్తం పద్దు రూ.2.90 లక్షల కోట్లలోపు ఉంటుంది. ఎన్నో ఆర్థిక కష్టాల నడుమ ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంటుందా? లేకుంటే మొత్తం ఆదాయాన్ని పెంచుకోవడానికి అప్పులను ఎక్కువగా చూపిస్తారా?  ఈ పద్దును ఎలా ప్రవేశపెట్టబోతోందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది.