calender_icon.png 8 October, 2024 | 3:56 AM

హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను అమృత్ 2.0లో చేర్చండి!

08-10-2024 01:25:25 AM

అవసరమైతే ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలి

ఇప్పటికీ పురాతన మురుగుశుద్ధి వ్యవస్థే

మెట్రో రైలు రెండోదశకు మద్దతు ఇవ్వండి

కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి):  హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్(సీఎస్‌ఎంపీ)ను అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో కేంద్రమంత్రి ఖట్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేదని కేంద్రమంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.

హైదరాబాద్‌లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచస్థాయి నగరంలో మాదిరి ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల్లో 100 శాతం ద్రవ వ్యర్థాల శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని కలిపి 7,444 కి.మీ. మేర రూ.17,212.69 కోట్లతో సీఎస్‌ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఆ డీపీఆర్‌ను ఖట్టర్‌కు అందజేశారు. సీఎస్‌ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

పనులకు అనుమతివ్వండి

హైదరాబాద్ నగరంలో 55 కి.మీ. మేర మూసీ నది ప్రవహిస్తోందని, ఇరువైపులా కలిపి 110 కి.మీ. మేర నగరంలోని మురుగంతా మూసీలోనే చేరుతోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. ఇలా మురుగు  మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్,  కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ రూపొందించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఆ డీపీఆర్‌ను ఖట్టర్‌కు సమర్పించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్-శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (36.8 కి.మీ.), రాయదుర్గం--కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్--చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియాపూర్-పటాన్చెరు (13.4 కి.మీ.), ఎల్బీ నగర్--హయత్ నగర్ (7.1 కి.మీ.) మొత్తం 76.4 కి.మీ. మేర డీపీఆర్‌లు పూర్తయినట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు.

ఈ కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 వ్యయం అవుతుందని అంచనా వేశామని, దీనిని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం 50:50 రేషియోలో జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పిస్తామని.. అది త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని కోరారు.

ముఖ్యమంత్రి వెంట నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డ్డి, గడ్డం వంశీకృష్ణ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు.