calender_icon.png 4 October, 2024 | 3:05 AM

5న శంషాబాద్ మున్సిపల్ భవనం ప్రారంభం

04-10-2024 12:51:35 AM

హాజరు కానున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు  

రాజేంద్రనగర్, అక్టోబర్ 3: శంషాబాద్ మున్సిపాలిటీ నూతన భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. శనివారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని పనులు, ఏర్పాట్లు పూర్తయినట్లు మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు పేర్కొన్నారు.

ప్రస్తుతం శంషాబాద్‌లోని పోలీస్ స్టేషన్ వద్ద ఇరుకైన భవనంలో మున్సిపల్ కార్యాలయం కొనసాగుతోంది. దీంతో అధికారులు, సిబ్బందితో పాటు ప్రతిరోజు ఆఫీసుకు వచ్చే వందలాది మంది పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం శంషాబాద్‌లోని హుడా రహదారి కాంప్లెక్స్ సమీపంలో కొత్త భవనాన్ని అన్ని వసతులు, హంగులతో నిర్మించారు.

జీ ప్లస్ టూ విధానంలో నిర్మించిన ఈ భవనంలో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. సమావేశపు మందిరంతో పాటు మొత్తం 16 గదులకు పైగానే నిర్మించినట్లు ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. రూ.5.70 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది సెప్టెంబర్ 29న అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరికొద్దిరోజుల్లో శంషాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గం గడువు కూడా పూర్తికానుంది. శంషాబాద్ పట్టణాన్ని జీహెచ్‌ఎంసీలో కూడా కలపనున్నారు. ఈ నేపథ్యంలో భవనాన్ని ప్రారంభిస్తున్నట్లు సమాచారం.