- రిటైర్డ్ ఉద్యోగికి రూ.4.4లక్షల టోకరా
- సైబర్ క్రైం పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో అమాయక ప్రజల వద్ద అందినకాడికి దోచుకుంటు న్నారు. తాజాగా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగం పేరుతో ఓ రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి రూ.4.4 లక్షలు కాజేశారు. వివరాలు.. హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి(57) ఫేస్బుక్లో వర్క్ ఫ్రమ్ హోం జాబ్ కోసం ఒక ప్రకటను చూసి.. ఆ లింక్ఫై క్లిక్ చేశాడు. అది అతనిని టెలిగ్రామ్ ఖాతాకి దారి మళ్లించింది. ఈ క్రమంలో టెలిగ్రామ్ యాప్ ద్వారా స్కామర్లు వర్క్ ఫ్రం హోం జాబ్ గురించి బాధితుడికి వివరించారు. జీతం తదితర చెల్లింపులు చేయడానికి పూర్తి సమాచారం అందించాలని బాధితుడిని కోరారు.
వారి సూచనలను మేరకు బాధితుడు ఓ లింక్ ద్వారా తన బ్యాంక్ ఖాతా నంబర్ తదితర వివరాలను పంపించాడు. ఈ క్రమంలో స్కామర్లు కొన్ని వీడియోలను పంపి వాటికి రేటింగ్ చేయమని, చెల్లింపు కోసం వాటి స్క్రీన్ షాట్లను పంపమని చెప్పారు. మొదట్లో కొంత మొత్తాన్ని లాభాలుగా చెల్లించిన స్కామర్లు.. అనంతరం తన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి కొద్ది మొత్తం నగదు చెల్లించాలని బాధితుడిని కోరారు. వారి మాటలు నమ్మిన బాధితుడు వాళ్లు సూచించిన విధంగా మోసగాళ్ల ఖాతాలోకి రూ. 4.42 లక్షలు బదిలీ చేశాడు.తదనంతరం అవతలివైపు నుంచి ఎలాంటి రిప్లు లేకపవోడంతో మోసపోయానని గ్రహించిన బాధితు డు ఆదివారం ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.