19-03-2025 07:45:09 PM
రేషన్ కార్డ్ లేకపోవడంతో అర్హత కోల్పోతున్న యువత..
ప్రభుత్వం తక్షణమే స్పందించి నిబంధనలు మార్చాలి..
సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్..
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ సేన సమావేశం మండల అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులకు అవకాశం కల్పించకపోవడంతో 12 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేక పెళ్లిళ్లు జరిగి వేరుగా నివాసం ఉంటున్న ఎందరో యువకులు ఇంకా తల్లిదండ్రులు రేషన్ కార్డులోనే కొనసాగుతూ వచ్చారన్నారు.
కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో నిబంధనలు ప్రకారం పాత రేషన్ కార్డులు డిలీట్ అయితేనే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండడంతో పలువురు యువకులు డిలీట్ ఆప్షన్ ద్వారా పాత రేషన్ కార్డులు డిలీట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యువతకు చేయూత నందించేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తీసుకొని వచ్చిందని, ఎంతో ఆశగా శిక్షణతో పాటుగా సబ్సిడీ రుణాలు లభిస్తాయని ఉపాధి పొందవచ్చు అని ఆశతో ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఈ సేవా సెంటర్లకు వెళ్తే అక్కడ నిర్వాహకులు వివరాలు నమోదు చేసిన క్రమంలో రేషన్ కార్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంతకుముందు పాత కార్డు డిలీట్ అయిన కారణంగా ఆ నెంబర్ కొడితే దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయని చెప్పడంతో యువకలు చాలా మంది నిరుత్సాహ పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్ బోడ శేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.