22-01-2025 12:50:45 AM
* జిల్లాలో అట్టహాసంగా ప్రారంభమైన గ్రామసభలు
* కాచారం గ్రామసభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
రంగారెడ్డి, జనవరి 21 (విజయ క్రాంతి ) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియని, అర్హులకు తప్పనిసరిగా పథకాల అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు.
మంగళవారం శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరిం చారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు.
ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో రాజేందర్ నగర్ ఆర్డీఓ వెంకట్ రెడ్డి, తహశీల్దార్ రవీందర్ దత్, పిడి హౌసింగ్ మధుసూదన్ నాయక్, మండల ప్రత్యేక అధికారి మున్నీ, స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.