హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లా ల్లో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్,వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ సంచాలకులు ప్రకటించారు. బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కరుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చమ విదర్భ పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉందని వివరించారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కిమీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు.