- తీవ్ర దగ్గుతో పాటు ఊపిరి తీసుకునేందుకు అవస్థలు
- జహీరాబాద్ ఏరియా దవాఖానలో చికిత్స
సంగారెడ్డి, అక్టోబర్ 25 (విజయక్రాంతి)/జహీరాబాద్ : న్యాల్కల్ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో విద్యాలయ సిబ్బంది గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో జహీరాబాద్ ఏరి యా దవాఖానకు తరలించారు. విద్యార్థినులు తీవ్రమైన దగ్గుతో పాటు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. వైద్యులు పరీక్షల నిమిత్తం వారి నుంచి రక్తం సేకరించారు. రక్త పరీక్షల ఫలితాల తర్వాత అస్వస్థతకు గురికావడానికి గల కారణాలను వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.
కాగా, కేజీబీవీలో నాణ్యమైన ఆహారం, తాగునీరు లేకపోవడంతోనే విద్యార్థినులు అనారోగ్యాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేజీబీవీలలో పనిచేసే ప్రత్యేకాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాణ్య మైన ఆహారం, తాగునీరు, గుడ్లు, పండ్లు అందించడం లేదని విద్యార్థినులు ప్రశ్ని స్తే.. కక్ష పెంచుకొని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.