21-02-2025 07:59:23 PM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఇసుక మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఎస్పీ డివి శ్రీనివాస్ తో కలిసి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ట్రాన్స్ పోర్టు, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో అక్రమ కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ దీపక్ తివారి సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో అనంతరం మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలలో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్యం, పైప్ లైన్ మరమ్మత్తులు, ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదేశించారు. అంతకముందు జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఏడుగురు వైద్యాధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.