calender_icon.png 22 September, 2024 | 10:05 PM

అనుమతుల పేరుతో అక్రమ తవ్వకాలు

08-09-2024 02:43:20 PM

భారత్ మాల ప్రాజెక్టు పేరుతో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లు..

టిప్పర్లను అడ్డుకున్న ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ 

మేఘా ఇంజనీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి 

అలంపూర్: గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మండల కేంద్ర సమీపంలో ఉన్న గట్టుపై భారత్ మాల రోడ్డు నిర్మాణం ప్రాజెక్ట్ పనుల పేరుతో కాంట్రాక్టర్లు అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. శనివారం స్థానిక నాయకులతో కలిసి గట్టుపై తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.అక్రమంగా తరలిస్తున్న మట్టి రవాణాను అడ్డుకున్నారు.అనంతరం సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన అధికారులు తవ్వకాలు జరిగే ప్రాంతం వద్దకు చేరుకుని టిప్పర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం సంపత్ కుమార్  మాట్లాడుతూ...సహజ వనరులను కాపాడాల్సిన అధికారులే స్థానిక ఎమ్మెల్యే విజేయుడు,ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడితో అక్రమ తవ్వకాలకు సహకరించడం పట్ల వారి తీరుపై సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న మేఘా ఇంజనీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు,స్థానిక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూడాలని అధికారులను సంపత్ కుమార్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రభుత్వ ఆస్తుల్ని  కాజేయాలని చూసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అనుమతులు గోరంత... తవ్వేది కొండంత

వడ్డేపల్లి శివారులో జరుగుతున్న భారత్ మాల రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు పనులను మేఘా ఇంజనీరింగ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. అయితే కంపెనీ వ్యవహారం ఎర్రమట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నది గోరంత అయితే దాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా మట్టిని తవ్వి రవాణా చేసేది మాత్రం కొండంత అన్న చందంగా మారిందని అట్టి అక్రమ మట్టి రవాణాపై   అధికారులు చర్యలు తీసుకుని టెండర్ దక్కించుకున్న ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు.